దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు
చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశ్రమ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ద్విసభ్య ధర్మాసనం
బుదవారం విచారణ చేపట్టింది. దీనికి హాజరైన ఈడీ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబందించి పూర్తి
వివరాలను తెలంగాణ ప్రభుత్వం తమకు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుండటం వలన కేసు దర్యాప్తు
ఆలస్యం అవుతోందని ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఈడీ కోరిన వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం దేనికి?అని ప్రశ్నించింది. రెండు వారాలలోగా ఈ కేసులకు సంబందించిన కాల్ డేటా, ఎఫ్ఐఆర్ కాపీలు, ఇతర డాక్యుమెంట్లతో సహా అన్ని వివరాలను
ఈడీకి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ఎక్సైజ్ శాఖ సహకరించకపోతే మళ్ళీ
హైకోర్టును ఆశ్రయించవచ్చని ఈడీకి సూచించింది.
కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై వేసిన పిటిషన్పై హైకోర్టు నిన్న విచారణ జరిపింది.
దీనిలో ఆయన తరపున ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి హాజరుకాగా, ఈడీ
తరపున జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ హాజరయ్యారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం,
సరఫరాను ఉక్కుపాదంతో అణచివేయాలంటూ మాదకద్రవ్యాల సప్లైయర్ టోనీని అతనికి సహకరిస్తున్న
మరికొందరిని పోలీసులు అదుపులో తీసుకొని ప్రశిస్తూ మాదక ద్రవ్యాలు తీసుకొంటున్న కొందరు
వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. మరి టాలీవుడ్ ప్రముఖుల విషయంలో ఎందుకు
భిన్నంగా వ్యవహరిస్తున్నారు? హైకోర్టు చేత ఎందుకు చెప్పించుకొంటున్నారు?ఈ లెక్కన రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడం సాధ్యమేనా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.