గత ఏడాది కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో కరోనా ఆంక్షలు విధించి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేశారు. మొన్న నగరంలో టోలీచౌక్ ప్రాంతంలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో మళ్ళీ ఆ ప్రాంతంలోని పారామౌంట్ కాలనీలో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి కరోనా ఆంక్షలు విధించారు.
ఆ కాలనీలో మొత్తం 25 ఇళ్ళను కంటైన్మెంట్ జోన్ పరిధిలో చేర్చి వాటిలో నివశిస్తున్నవారితో సహా ఆ పరిసర ప్రాంతాలలోని 700 ఇళ్ళలో నివశిస్తున్న 136 మందికి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఒకవేళ ఈ టెస్టులో పాజిటివ్ వస్తే వారి రక్తం నమోనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిస్తామని అధికారులు చెప్పారు.
కరోనా కంటే ఒమిక్రాన్ వైరస్ 5 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని ఇప్పటికే స్పష్టమైంది కనుక జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించవలసిందే. ఈ దశలోనే ఒమిక్రాన్ కట్టడి చేయగలిగితే మళ్ళీ దాంతో ప్రజలు, ప్రభుత్వం కూడా బాధలు పడక్కరలేదు.