ఏడాదిగా ఢిల్లీ-సింఘూ సరిహద్దు వద్ద వేలాదిమంది రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ పట్టించుకొని మోడీ సర్కార్ వ్యవసాయ చట్టాలపై హటాత్తుగా ఎందుకు వెనక్కు తగ్గింది? అనే ప్రశ్నకు సమాధానాలు కళ్ళ ముందే ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్, యూపీ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రం ఈ చట్టాలపై ఇంకా మొండిపట్టు పట్టి కూర్చోంటే కీలకమైన ఆ రెండు రాష్ట్రాలలో రైతులు బిజెపికి దూరం అవుతారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారిని ప్రతిపక్షాలు ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు యూపీ కూడా బిజెపి చేజారిపోయే ప్రమాదం ఉంది. కనుక వారిని ప్రసన్నం చేసుకొనేందుకే కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. తద్వారా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయవచ్చు.
రెండు రాష్ట్రాలలో పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకే ప్రధాని నరేంద్రమోడీ ఓ మెట్టు దిగి రైతులకు క్షమాపణ చెప్పి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పడం వలన ఆయన గౌరవం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగింది. ఆయన రైతులకు క్షమాపణ చెప్పడం చాలాహుందాగా ఉందని ప్రతిపక్షాలు అంటుండమే నిదర్శనం.
అయితే ప్రతిపక్షాలు ఇప్పుడు ఆయనను గేలి చేయవచ్చు కానీ దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి అంతటి వ్యక్తి తమకు క్షమాపణలు చెప్పారని రైతులు పొంగిపోతున్నారు. ఇంతకాలం ప్రధాని నరేంద్రమోడీని ద్వేషించిన రైతులే ఇప్పుడు ఆయనను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. అంటే ఎక్కడ నెగ్గాలో కాదు...ఎక్కడ తగ్గాలో కూడా ప్రధాని నరేంద్రమోడీకి బాగా తెలుసని స్పష్టమైంది.