సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “దళిత బంధు పధకం యధాతధంగా అమలుచేస్తాం. ఈ పధకం కోసం వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తాము. దాంతో రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలకు ఈ పధకాన్ని అందిస్తాం. ఆలోగా అంటే...2022 మార్చిలోగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తిగా అందరికీ, రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు మండలలో ప్రతీ దళిత కుటుంబానికి ఈ పధకాన్ని అమలుచేస్తాము. ఇది ఇంకా ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నందున దీనిలో లోటుపాట్లు తెలుసుకొని నిఖచ్చిగా అమలుచేసేందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులకు కాస్త అనుభవం అవసరం. కనుక ముందుగా రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో వంద మంది చొప్పున ఎంపికచేసి వారికి కూడా దళిత బంధు పధకం వర్తింపజేస్తాము. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 4-5 లక్షల మందికి ఈ పధకాన్ని అందిస్తాం,” అని సిఎం కేసీఆర్ చెప్పారు.
దళిత బంధు పధకం రాష్ట్రంలో ఎంతగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిందో అందరూ చూశారు. కానీ హుజూరాబాద్లో దళిత బంధు తమకు భారీ విజయం తెచ్చిపెడుతుందనే టిఆర్ఎస్ నమ్మకం పటాపంచలైంది. టిఆర్ఎస్ ఓటమికి వేరే అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. కానీ దళిత బంధు టిఆర్ఎస్కు ఏమాత్రం ఉపయోగపడలేదని స్పష్టమైంది. కానీ ఈ పధకం సిఎం కేసీఆర్ మానస పుత్రిక కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నేతలు గట్టిగా సమర్ధిస్తున్నప్పటికీ వారి మనసులో ఏముందో తెలీదు. ఒకవేళ మున్ముందు దీంతో టిఆర్ఎస్కు రాజకీయంగా లబ్ది కలిగితే మంచిదే. కానీ ఏ కారణం చేతైనా దీనిని అమలుచేయలేకపోతే దానికి టిఆర్ఎస్ పార్టీయే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఈ పధకంపై పార్టీలో అందరి సమ్మతితో సిఎం కేసీఆర్ అడుగు ముందుకు వేయడం మంచిదేమో?