హుజూరాబాద్‌ ఎఫెక్ట్: మంత్రి హరీష్‌ వరాలు

October 24, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక టిఆర్ఎస్‌ ఇన్‌ఛార్జ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌రావు జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో కొన్ని వరాలు ప్రకటించారు. హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ పార్టీని గెలిపిస్తే రైతులకు వడ్డీతో సహా పంట రుణాలు మాఫీ చేస్తామని, ఆసరా పింఛను వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గిస్తామని ప్రకటించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 5,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. సొంతంగా జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకొనేందుకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. 

టిఆర్ఎస్‌ గెలిస్తే ఏమి చేయగలమో చెప్పామని మరి ఈటల రాజేందర్‌ గెలిస్తే ఏమి చేస్తారో చెప్పాలని మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవడం చాలా అవసరమని అన్నారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారానికి నేను వెళ్ళడం లేదు ఎందుకంటే ఇది మా పార్టీకి చాలా చిన్న విషయమని ఆ పార్టీ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పధకం ప్రారంభించే నెపంతో ఒకసారి, మళ్ళీ త్వరలో మరోసారి హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతుండటం, మంత్రి హరీష్‌రావు ఆఖరి నిమిషంలో ఈ వరాలు ప్రకటించడం గమనిస్తే గెలుపు కోసం టిఆర్ఎస్‌  ఎంతగా ఆరాటపడుతోందో అర్ధమవుతుంది. ఈ ఉపఎన్నిక ఆ పార్టీకి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో కూడా అర్ధమవుతుంది.   



Related Post