హుజూరాబాద్ ఉపఎన్నిక నేపధ్యంలో ఆ నియోజకవర్గంలో దళిత బంధు పధకం అమలుచేయడాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు కూడా ఈసీ లేఖ వ్రాసింది. హుజూరాబాద్ దళిత బంధు పధకం నిలిపివేయాలని లేఖలో కోరింది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దళిత బంధు పధకం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున దానిని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పధకాన్ని ప్రారంభించింది కనుక ఈసీ తాజా ఆదేశంతో టిఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. పైగా ఈటల రాజేందర్ను ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్కు ఇది బలమైన ఆయుధంగా ఉపయోగపడుతుంది కూడా. తమ ప్రభుత్వం ఈ పధకంతో నియోజకవర్గంలో దళితులకు పదేసి లక్షలు చొప్పున ఇవ్వాలనుకొంటే, ఈటల రాజేందర్ ఈసీకి లేఖ వ్రాసి అడ్డుకొన్నారని, కనుక అటువంటి వ్యక్తికి ఎందుకు ఓట్లు వేయాలని టిఆర్ఎస్ నేతలు ప్రశ్నించకుండా ఉండరు. కనుక ఈసీ తాజా నిర్ణయం ఈటల రాజేందర్కు కూడా ఇబ్బందికలిగించే విషయమే.