కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఓ సమస్యను పరిష్కరించలేనపుడు లేదా నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకొన్నప్పుడో ఓ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటుంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం పట్ల పార్టీ సీనియర్ నేతలలో అసంతృప్తి నెలకొని ఉండటంతో దీనికి ఓ కమిటీ వేయడమే పరిష్కారంగా భావించినట్లుంది. రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. దానిలో రేవంత్ రెడ్డి నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వి.హనుమంతరావు, కోమటిరెడ్డి సోదరులతో సహా డజను మందికి పైగా సభ్యులుగా నియమించింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ మానిక్కం ఠాగోర్ ఈ కమిటీకి ఛైర్మన్, షబ్బీర్ అలీ కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలో వి.హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కె.జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, బలరాం నాయక్, పోడెం వీరయ్య, సీతక్క, ఇంకా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు , అన్ని కమిటీల ఛైర్మన్లు, ఇన్ఛార్జ్ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.
ఇది పేరుకి రాజకీయ వ్యవహారాల కమిటీ అయినప్పటికీ పార్టీలో అసమ్మతిని తగ్గించడానికేనని అర్ధమవుతోంది. అయితే దీంతో కనీసం పార్టీలో అసమ్మతి అయినా తగ్గుతుందా? అంటే అనుమానమే.