ఓ పక్క టోక్యో ఒలింపిక్స్లో మన క్రీడాకారులు పతకాలు సాధించేందుకు చమటోడ్చుతుంటే, చంఢీఘర్లోని ఓ యువ మహిళా బాక్సర్ రీతు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాహనాల పార్కింగ్ టికెట్స్ అమ్ముకొంటూ దయనీయమైన జీవితం గడుపుతోంది. ఆమె రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని అనేక మెడల్స్ గెలుచుకొంది కానీ ఆమె ప్రతిభను ఎవరూ గుర్తించలేదు. ఆమెకు అండగా ఎవరూ నిలబడలేదు!
నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె ఆ స్థాయికి చేరుకొనేందుకే అనేక కష్టాలను కన్నీళ్ళను అనుభవించింది. కానీ ఎంత కృషి చేసినా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అండదండలు లభించకపోవడంతో చివరికి విధిలేని పరిస్థితులలో రీతు తనకు ఎంతో ఇష్టమైన బాక్సింగ్ను విడిచిపెట్టి కుటుంబాన్ని పోషించుకొనేందుకు పార్కింగ్ టికెట్స్ అమ్ముతూ భారంగా జీవనం సాగిస్తోంది.
తన తండ్రి ఆరోగ్యంగా ఉన్నంతకాలం తనకు యధాశక్తిన సహకరించారని కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యం పాలవడంతో కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత తనపై ఉందని కనుక బాక్సింగ్ విడిచిపెట్టి ఈ పని చేసుకొంటున్నానని రీతూ తెలిపింది. ఇదీ... మన క్రీడాకారుల పరిస్థితి! ఇటువంటి పరిస్థితులలో కూడా ఏమాత్రం తోడ్పాటు దొరికినా తమ సత్తా చూపి భారత్ కీర్తి పతాకం రెపరెపలాడించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.