తెలంగాణ ప్రభుత్వంలో చిరకాలం పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాజంలో బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ముఖ్యంగా...దళితుల సంక్షేమం కోసం తపిస్తుంటారు. అందుకే ఇంకా ఆరేళ్ళు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొన్నారు. దళితుల సంక్షేమం కృషి చేస్తున్న ఆయన సిఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పధకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విశేషం. కానీ ఆయన వాదన చాలా సహేతుకమైనది... అర్దవంతమైనదని చెప్పవచ్చు.
“హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఈ పధకంలో ఒక్కో కుటుంబానికి పది లక్షలు చొప్పున పంచిపెడితే ఆ కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి. అదే...ఆ డబ్బుతో దళిత విద్యార్ధుల కోసం చక్కటి పాఠశాలలు కట్టించి వారికి మంచి చదువులు చెప్పించినట్లయితే వారి జీవితంలో ఉన్నతస్థితికి ఎదుగగలుగుతారు. ప్రభుత్వం ఎవరిపైనో (ఈటల రాజేందర్) ప్రతీకారం తీర్చుకొనేందుకే ఈ పధకంతో ఇంత డబ్బు ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పధకం కింద ఖర్చు చేయబోయే సొమ్ముతో అనేక డిజిటల్ పాఠశాలలు ఏర్పాటుచేయవచ్చు. వారి కోసం చక్కటి సంక్షేమ హాస్టల్స్ కట్టించవచ్చు. దళిత విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు కొని ఈయవచ్చు. దళితులకు గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కాదు... దళిత విద్యార్ధులకు చక్కటి చదువులు చెప్పింది పైకి ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వానికి ఇవన్నీ అక్కరలేదు. వారి ఓట్లు మాత్రమే కావాలి. అందుకే అంత డబ్బు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనకాడటం లేదు,” అని ప్రవీణ్ కుమార్ అన్నారు.