హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. చిరకాలంగా పెండింగులో ఉన్న అభివృద్ధి పనులకు కోట్లు రూపాయలు విడుదల చేసి హడావుడిగా పూర్తిచేయిస్తోంది. దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టు పేరుతో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెపుతోంది. వీటన్నిటితో అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకొని ఉపఎన్నికలో విజయం సాధించాలని ఆశిస్తోంది. అయితే ఇవన్నీ రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీశాయి.
తన రాజీనామా వలననే ప్రభుత్వం ఇవన్నీ చేస్తోందని లేకుంటే ఎన్నటికీ చేసేదికాదనే ఈటల రాజేందర్ వాదన స్థానిక ప్రజలకు బాగానే ఎక్కుతోంది. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించినట్లయితే తాను కూడా రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్పై కురుస్తున్న వరాలజడివాన, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ వాదనలపై సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. నియోజకవర్గాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగాలనా వాటి కోసం ప్రభుత్వం వేలకోట్లు విడిదల చేయాలన్నా ఉపఎన్నికలు వస్తేనే సాధ్యం కనుక ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే బాగుంటుందని మీడియా, సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.