ఆగస్ట్ మూడోవారం నుంచి భారత్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కావచ్చునని కాన్పూర్ ఐఐటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాయి. ఈ రెండూ సంస్థలు దీనిపై వేర్వేరుగా చేసిన అధ్యయనాల ప్రకారం...
• భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, కేసులు జూలై నెలాఖరుకల్లా పూర్తిగా తగ్గిపోతాయి.
• కరోనా తగ్గిన కారణంగా కర్ఫ్యూ, లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో మళ్ళీ ప్రజలు బయట తిరుగుతున్నారు. కానీ కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వలన మళ్ళీ మెల్లగా కరోనా వ్యాప్తి మొదలవుతుంది.
• ఆగస్ట్ 3వ వారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యి సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మళ్ళీ పతాకస్థాయికి చేరుతుంది.
• ఒకవేళ డెల్టా ప్లస్లో కొత్త వేరియెంట్లు (కరోనా మరో రూపం) వస్తే మాత్రం థర్డ్ వేవ్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు కావచ్చు.
• సెకండ్ వేవ్లో కంటే థర్డ్ వేవ్లో కరోనా కేసుల సంఖ్య 1.7 రెట్లు ఎక్కువగా నమోదవుతాయి.
• అయితే ఈసారి కరోనా కేసులు పెరిగినప్పటికీ, చాలా మంది టీకాలు వేయించుకొన్నందున ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
• డెల్టా ప్లస్, దాని కొత్త వేరియంట్లపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత సమర్ధంగా అడ్డుకొంటాయనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసి ఈ నివేదికలు రూపోదించినట్లు కాన్పూర్ ఐఐటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాయి.
• వాక్సిన్లు ఒక్కటే థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించగలవని రెండు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం భారత్లో 4.6 శాతం మంది రెండు డోసులు, 20.8 శాతం మంది ఒక్క డోస్ టీకాలు వేసుకొన్నారని, భారత్ జనాభాకు ఇది చాలా తక్కువని, ఇతర దేశాలతో పోల్చి చూసుకొన్నా భారత్ వ్యాక్సినేషన్లో వెనుకబడి ఉందని పేర్కొన్నాయి. కనుక వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నాయి.