గత కొన్ని రోజులుగా సిఎం కేసీఆర్ ఆసుపత్రులు, జిల్లాల పర్యటనలు చేస్తుండటంపై రాజకీయ వర్గాలలో అప్పుడే భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బయటకు పంపించిన తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తున్నారని బిజెపి నేతలు వాదిస్తున్నారు. ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరడంతో సిఎం కేసీఆర్ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారని అందుకే ప్రజల మద్యకు వస్తున్నారని బిజెపి నేతలు వాదిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సిఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తూ వరాలు ప్రకటిస్తూ టిఆర్ఎస్కు అనుకూల వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి నేతలు వాదిస్తున్నారు.
అయితే సిఎం కేసీఆర్కు హుజూరాబాద్ ఉపఎన్నికలను ఎదుర్కోవడం చాలా చిన్న విషయమని ఆయన 2023-24లో జరుగబోయే శాసనసభ ఎన్నికల కోసం ఇప్పుడే ఈవిదంగా సన్నాహాలు ప్రారంభించారని వాదిస్తున్నవారూ ఉన్నారు. అందుకే ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుపై మౌనం వహించిన సిఎం కేసీఆర్, మంత్రులు ఇప్పుడు ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గట్టిగా మాట్లాడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
కారణాలు ఏవైనప్పటికీ, ఇంతకాలం సిఎం కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్హౌస్ వీడి బయటకు రావడం లేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలే ఇప్పుడు ఆయన బయటకు వస్తుంటే ఎందుకు వస్తున్నారో అంటూ మాట్లాడుతుండటం విశేషం.