ఈటల రాజేందర్పై వేటు పడిన తరువాత హుజూరాబాద్ టిఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం ఏర్పడింది. ఇంతకాలం ఈటల రాజేందర్ వెనుక తిరిగినందున ఆయనతో బయటకు వెళ్ళాలా లేక టిఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని పార్టీలోనే కొనసాగాలా?అని వారు ఆలోచిస్తుండగానే ఓ వైపు టిఆర్ఎస్ అగ్రనేతలు, మరోవైపు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలలో భాగంగా వారిని తమవైపు ఆకర్షించుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈటల రాజేందర్ వ్యవహారం మొదలై ఇప్పటికీ నెలరోజులు పైనే అవుతోంది ఇంకా హుజూరాబాద్లో టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల పంపకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీరోజు కొందరు గులాబీ కండువాలు కప్పుకొంటూనే ఉన్నారు...మరికొందరు ఈటల శిబిరంలో చేరుతూనే ఉన్నారు. బహుశః ఉపఎన్నికలు మొదలయ్యే వరకు ఈ పంపకాలు కొనసాగుతూనే ఉండవచ్చు. అయితే కరోనా కారణంగా ఎన్నికల సంఘం ఎప్పుడు ఉపఎన్నికలు నిర్వహిస్తుందో తెలియదు కనుక అప్పటి వరకు ఇరువర్గాల మద్య జరిగే ఆధిపత్యపోరులో ఘర్షణలు తప్పకపోవచ్చు.