తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేయించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు ప్రభుత్వం దృవీకరించి ఇస్తుంది కనుక ఇది వారికి ఎంతో మేలు చేకూర్చేదే. కానీ ఇటీవల ఈటల రాజేందర్ అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఒక్క ఈటల మాత్రమే కాదు...ఇంకా అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులకు, అధికార, ప్రతిపక్ష నేతలకు కూడా వ్యవసాయభూములున్నాయి లేదా వారి అధీనంలో భూములున్నాయి. ఇప్పుడు చేయబోయేది డిజిటల్ సర్వే కనుక సిఎం కేసీఆర్ చెపుతున్నట్లు ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమాని అనేదే తేలిపోతుంది. కనుక ఈ సర్వేతో రాజకీయ నేతలకు మేలో కీడో జరుగవచ్చు. ముఖ్యంగా బినామీ పేర్లతో భూములున్నవారికి, అసైన్డ్ భూములున్నవారికి, ప్రభుత్వభూములను కలిపేసుకొన్నవారికి ఈ సర్వేతో సమస్యలు తప్పకపోవచ్చు. మరి వారి ఒత్తిళ్ళు తట్టుకొని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సర్వే చేయించి భూయజమానులను నిర్ధారించగలిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.