తెలంగాణ రాష్ట్రం కేవలం ఏడేళ్ళ వ్యవధిలోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో చేరడం విశేషం.
వ్యవసాయం: సిఎం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల కారణంగా రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ రంగాలలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఎండిన భూములు, ఎండిన కాలువలు, బోరుబావులతో ఉండే తెలంగాణ రాష్ట్రంలో నేడు ఎక్కడ చూసినా పచ్చదనం, నీళ్ళు కనిపిస్తున్నాయి. అంతే కాదు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి బియ్యం సరఫరా చేయగలిగే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది.
పరిశ్రమలు: తెలంగాణ ఏర్పడేనాటికే హైదరాబాద్లో అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలున్నమాట వాస్తవం. అయితే రాష్ట్రంలో మరెక్కడా పెద్దగా లేవు. కేటీఆర్ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పాత విధానాలను సమూలంగా మార్చివేసి పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్తగా ‘టిఎస్ ఐపాస్ పాలసీ’ని తీసుకురావడంతో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు తరలివచ్చాయి. హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఐటి కంపెనీలను రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి జిల్లాలకు వ్యాపింపజేశారు. ఎక్కడికక్కడ టీ-హబ్లు, పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయిస్తూ భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
మౌలిక వసతులు: తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో రోడ్లు, కాలువలు, త్రాగునీటి సౌకర్యం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పచ్చదనం వంటివన్నీ ఏర్పడటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీ జిల్లాకేంద్రంలో హైదరాబాద్కు ధీటుగా ట్యాంక్ బండ్, పార్కులు, అత్యాధునిక రైతు బజార్లు, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, వైద్య, నర్శింగ్ కళాశాలలు వగైరాలు ఏర్పాటవుతున్నాయి.
తెలంగాణ బాష, సంస్కృతి: ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాధారణకు, అవహేళనకు గురైన తెలంగాణ బాష, యాస, సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలకు సిఎం కేసీఆర్ సమున్నత గౌరవం కల్పించడంతో ఒకప్పుడు ఆత్మగౌరవం చంపుకొని జీవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు గర్వంగా తలెత్తుకొని జీవించగలుగుతున్నారు. ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సహా అందరూ వాటిని గౌరవిస్తున్నారు.