కరోనా వాక్సిన్లు సరఫరా చేయలేక చేతులెత్తేసిన కేంద్రప్రభుత్వం, విదేశాల నుంచి వాక్సిన్లు దిగుమతి చేసుకొని రాష్ట్రాలకు ఇవ్వకపోగా రాష్ట్రాలనే నేరుగా విదేశాల నుంచి వాక్సిన్లు తెప్పించుకోమని చెప్పడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పు పట్టారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “వాక్సిన్ల విషయంలో కేంద్రప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఒకవేళ దేశం మీదకి ఏ పాకిస్తానో
దండయాత్రకు వస్తే అప్పుడు కూడా కేంద్రప్రభుత్వం రాష్ట్రాలే తుపాకులు, యుద్ధట్యాంకులు వగైరా విదేశాల నుంచి సమకూర్చుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని
చెపుతుందా?అనే సందేహం కలుగుతోంది. కేంద్రప్రభుత్వం విదేశీ కంపెనీలతో
మాట్లాడి, వాక్సిన్లను దిగుమతి చేసుకొని అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి.
కానీ వాక్సిన్ల విషయంలో కేంద్రం చేతులు దులుపుకొని తప్పించుకొంటోంది. కనీసం దేశంలో
ఉత్పత్తి అవుతున్న వాక్సిన్ల పంపినీని సైతం సమర్ధంగా నిర్వహించలేకపోవడం వలననే దేశంలో
కరోనా సెకండ్ వేవ్ ఇంత బలంగా వచ్చింది. లక్షలాదిమంది ప్రజలు కరోనా బారినపడుతున్నారు.
కనీసం ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం విదేశీ కంపెనీలతో మాట్లాడి వాక్సిన్లను దిగుమతి చేసుకొని
రాష్ట్రాలకు అందివ్వాలి ఎందుకంటే రాష్ట్రాలు ఇంత భారం భరించడం కష్టం,” అని అన్నారు.