మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బిజెపిలో చేరవలసిందిగా ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, జి. వివేక్, అంతకు ముందు డికె.అరుణ, జితేందర్ రెడ్డిలు ఆయనతో భేటీ అయ్యి బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించారు. టిఆర్ఎస్ను… సిఎం కేసీఆర్ను ఒంటరిగా ఢీకొని పోరాడటం చాలా కష్టమని, బిజెపిలో చేరితే కలిసి పోరాడుదామని వారు ఆయనకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరడంపై తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకొంటానని ఈటల రాజేందర్ చెప్పారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ నేతలను కలిసినప్పుడు వారుకూడా పార్టీలోకి ఆహ్వానించారు.
ఇప్పుడు ఈటల ముందు అనేక సమస్యలున్నాయి. 1. భూకబ్జాల ఆరోపణల నుంచి విముక్తి పొందడం. 2. ఆ కారణంగా దెబ్బ తిన్న తన విశ్వసనీయతను, ప్రజాభిమానాన్ని మళ్ళీ సంపాదించుకోవడం. 4. తన రాజకీయ భవిష్యత్ దెబ్బ తినకుండా కాపాడుకోవడం. 5. దాని కోసం సరైన నిర్ణయం తీసుకోవడం. 6. తన అనుచరులు చేజారిపోకుండా కాపాడుకోవడం. 7. సొంతంగా పార్టీ పెట్టాలా లేదా కాంగ్రెస్, బిజెపిలలో దేనిలో చేరాలో నిర్ణయించుకోవడం.
ఇలా చెప్పుకొంటూపోతే ఈటల రాజేందర్ ముందు అనేక సమస్యలు, సవాళ్ళు ఉన్నాయి. కనుక ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ దెబ్బ తినడం ఖాయం. మరి ఆయన ఇంకా ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకోంటారో చూడాలి.