రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్పై కబ్జా ఆరోపణలు రావడంతో సిఎం కేసీఆర్ వెంటనే ఆయనను మంత్రివర్గంలో నుంచి తొలగించి ఆ శాఖను తనవద్దే అట్టేపెట్టుకొన్నారు. ఈ కరోనా విపత్కాలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పాత్ర చాలా కీలకమైనది. కానీ ఈటల రాజేందర్ను తప్పించడంతో ఇప్పుడు మంత్రి లేకుండానే నడుస్తోంది. ఆ శాఖను సిఎం కేసీఆరే స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ ఆయనపై ఇప్పటికే చాలా భారం ఉన్నందున ఇది అదనపు భారమే అవుతుందని వేరే చెప్పక్కరలేదు. మరోపక్క హైకోర్టు కూడా నిత్యం ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఈరోజు జరిగిన విచారణలో కూడా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బహుశః తదుపరి విచారణలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను మంత్రి లేకుండానే నడిపిస్తుండటంపై హైకోర్టు ఆక్షేపించవచ్చు. కనుక ఈటల రాజేందర్ స్థానంలో కొత్తగా ఎవరినైనా నియమించే అంశంపై ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో సిఎం కేసీఆర్ ఏమైనా చెపుతారా లేదా అని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.