ఈసారి మార్చి నెల నుంచి వేసవి తీవ్రత పెరిగిపోవడంతో ఇళ్ళు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్లో ఏసీల వాడకం పెరిగిపోయింది. ఎండలు మండిపోతుండటంతో వ్యవసాయం కోసం భారీగా విద్యుత్ వినియోగమవుతోంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది.
గత ఏడాది ఫిబ్రవరిలో 13,168 మెగావాట్స్ విద్యుత్ వినియోగించగా, ఈ ఏడాది మార్చి 26వ తేదీన 13,668 మెగావాట్స్ విద్యుత్ వినియోగమైందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది ఇదే సమయానికి 1,700 మెగావాట్స్, ఈ ఏడాది 2,760 మెగావాట్స్ విద్యుత్ వినియోగం అయ్యిందని చెప్పారు. ఒక్క వ్యవసాయ రంగానికే 5,000 మెగావాట్స్ విద్యుత్ డిమాండ్ ఉందని చెప్పారు. ఇదంతా సిఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు అందరి సమిష్టి కృషితోనే సాధ్యం అయ్యిందని అన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎంత విద్యుత్ డిమాండ్ పెరిగినా ఎటువంటి అవాంతరాలు లేకుండా అవసరమైనంత విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉన్నామని దేవులపల్లి ప్రభాకర్రావు చెప్పారు.