జానారెడ్డి ఇజ్జత్ కా సవాల్

March 31, 2021


img

సాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కె.జానారెడ్డి పార్టీ బలం కంటే సొంత బలం, పేరు ప్రతిష్టలు, నియోజకవర్గంలోని ప్రజలతో ఉన్న సంబందాలను నమ్ముకొనే బరిలో దిగారని చెప్పవచ్చు. కనుక ఈ ఎన్నికలు ఆయనకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే ఆయన పరువు నిలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరువు కూడా నిలుస్తుంది. పార్టీ పరువు నిలబెట్టినందుకుగాను ఆయనకు పిసిసి అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యం లేదు. కానీ ఈ వయసులో కాంగ్రెస్ పార్టీని భుజానికెత్తుకొని మోయడం కష్టం. ఒకవేళ జానారెడ్డి అందుకు సిద్దపడినా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సాధించడం ఇంకా కష్టం కనుక ఆ భారం వద్దనుకొని మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీలో ఓ ఎమ్మెల్యేగా కొనసాగడం కూడా ఆయనకు చాలా ఇబ్బందికరమే.  

సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా ఒకవేళ ఈ ఉపఎన్నికలలో జానారెడ్డి ఓడిపోతే ఆయన రాజకీయాలలో నుంచి నిష్క్రమించవచ్చు. ఇది ఆయన గొప్ప రాజకీయ జీవితానికి అవమానకరమైన ముగింపు అవుతుంది. ఈ అసంతృప్తి ఆయన జీవితాంతం వేదిస్తుంది. ఈ ఉపఎన్నికలలో ఓడిపోయినా కూడా ఒకవేళ ఆయన రాజకీయాలలో కొనసాగినా మునుపటి గౌరవం ఆశించడం కష్టం. కనుక ఏవిదంగా చూసినా జానారెడ్డి కోరి కష్టాలు కొనితెచ్చుకొన్నట్లే భావించవచ్చు.


Related Post