నిన్న వెలువడిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికార వైసీపీ ఘనవిజయం సాధించింది. టిడిపికి మంచి పట్టున్న చిత్తూరు, అనంతపురం, కృష్ణా, గోదావరి విశాఖ, విజయనగరం జిల్లాలలో కూడా పట్టు సాధించింది. ఏపీలోని 73 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను వైసీపీ గెలుచుకొంది. ఈ ఎన్నికలలో గెలిచి వైసీపీపై రాజకీయంగా పైచేయి సాధించాలని టిడిపి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒక్క తాడిపత్రి, మైదుకూరులో మాత్రమే టిడిపి ఎక్కువ వార్డులు టిడిపి గెలుచుకొంది.
ఏపీ రాజధానిని విశాఖపట్నానికి తరలింపు, హిందూ దేవాలయాలపై దాడులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలపై జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉంటుంది కనుక ఈ ఎన్నికలపై టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు చాలా ఆశలు పెట్టుకొన్నాయి. కానీ వాటి అంచనాలను తలక్రిందులు చేస్తూ వైసీపీ ఘన విజయం సాధించింది. కనుక ఇకపై ఏపీలో కూడా టిడిపి తన మనుగడ కాపాడుకోవడం కోసం పోరాడక తప్పదు లేకుంటే వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి కనుమరుగయిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే బిజెపి, జనసెబ్న పార్టీలు కూడా తన వ్యూహాలు మార్చుకోకతప్పదు.