ఈనెల 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతునందున ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కనుక ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణపై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రతిపక్షాలు దీనిని అవకాశంగా మలుచుకొని వేతనసవరణ చేయకుండా తాత్సారం చేస్తూ ప్రభుత్వం ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు టిఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు వేసే ప్రమాదం ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేని పరిస్థితిలో ఉంది కనుక సిఎం కేసీఆర్ చాలా లౌక్యంగా ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యి 29 శాతం ఫిట్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయం ఈరోజు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో పట్టభద్ర ఓటర్లను ప్రభావితమవుతారని వేరే చెప్పక్కరలేదు. కానీ సిఎం కేసీఆర్ కానీ ప్రభుత్వంలో మరెవరూ గానీ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు… ఉద్యోగ సంఘాల నేతలే ఈవిషయం మీడియాకు తెలియజేశారు. కనుక ప్రతిపక్షాలు, ఎన్నికల సంఘం కూడా దీనిని తప్పు పట్టలేవు. వేతన సవరణపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను సిఎం కేసీఆర్ చాలా లౌక్యంగా ఈవిదంగా తిప్పి కొట్టడమే కాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకొని టిఆర్ఎస్ వైపే ఉండేలా చేశారని చెప్పవచ్చు.