హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం ‘భారత్ నీతి’ సంస్థ ఆధ్యర్యంలో జరిగిన ‘డిజిటల్ హిందూ కాంక్లేవ్’ అనే చర్చా కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్గా మార్చుతామని అన్నారు. అంతేకాదు...సైద్దాంతిక మార్పు కోసమే నగరం పేరు మార్చాలనుకొంటున్నామని చెప్పడం ఇంకా విస్మయం కలిగిస్తుంది. అంటే ప్రస్తుతం నగరంలో నెలకొన్న హిందూ-ముస్లిం మిశ్రమ సంస్కృతి స్థానంలో పూర్తిగా హిందూ సంస్కృతిని తీసుకురావడమే ఆయన మాటలకు అర్ధమని వేరే చెప్పక్కరలేదు.
ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ రాష్ట్రంలో మెల్లగా ఇటువంటి మార్పులను తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో అక్కడి మైనార్టీవర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరాల పేర్ల మార్పుతో వాటి చారిత్రిక నేపద్యం మరుగునపడుతుంది. నగరంలో సైద్ధాంతిక మార్పు పేరుతో ఓ మతాన్ని లేదా సంస్కృతిని బలవంతంగా ప్రజలపై రుద్దాలని చూస్తే అది అశాంతికి దారితీసే ప్రమాదం ఉంటుంది. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేదా దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడినా అందరూ హర్షిస్తారు. కానీ వాటికి బదులు ఇటువంటి వివాదాస్పద అంశాలను పైకి తీసుకురావడం ఎంతవరకు సబబు?