తెలంగాణ కాంగ్రెస్ నేతల పనితీరుపట్ల రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ మధుయాష్కీ శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి పిసిసి అధ్యక్షుడి నియామకంలో సామాజిక న్యాయం పాటించాలని, అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని సూచించగా రాహుల్ గాంధీ ఆయనకు షాక్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పనితీరు అంతంతమాత్రంగానే ఉందని రాహుల్ గాంధీ అన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఒక్కరే ధైర్యంగా సిఎం కేసీఆర్ను గట్టిగా నిలదీస్తున్నారని పార్టీలో మిగిలిన నేతలు ఈవిషయంలో అలసత్వంతో వ్యవహరిస్తున్నారని అన్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడిగా ఎప్పుడు, ఎవరిని ఎంపిక చేయాలో తనకు బాగా తెలుసని రాహుల్ గాంధీ చెప్పడంతో మధుయాష్కీ మరేమీ మాట్లాడకుండా చేసినట్లు తెలుస్తోంది. రాజీవ్ రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేపట్టడంపై పార్టీలో సీనియర్లు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం మెచ్చుకొన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో రేవంత్ రెడ్డి తప్ప మిగిలినవారి పనితీరుపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినందున పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డినే నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చు.