మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ చచ్చినపాము వంటిది. దాని గురించి ఆలోచించనవసరం లేదు. కానీ బిజెపి కాటేయడానికి వస్తున్న నాగుపాము వంటిది కనుక దానిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. గత ఏడేళ్ళ కాలంలో ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశానికి ఏమి మేలు జరిగింది? కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది అని పోల్చి చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిత్యం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యప్రజల బ్రతుకులు మరింత దుర్భరం చేయడం తప్ప మోడీ ప్రభుత్వం ఏమి చేసింది? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ‘కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము’ అని మంత్రి జగదీష్ రెడ్డి అంటుంటే, ‘కాంగ్రెస్ పార్టీయే మా ప్రధాన ప్రత్యర్ధి...’ అంటుంటారు మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనుక కాంగ్రెస్ చచ్చిన పామో కాదో ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో బిజెపి శక్తివంతంగా మారి టిఆర్ఎస్కు సవాళ్ళు విసిరేస్థాయికి చేరింది కనుక అది కాటేయడానికి వచ్చిన నాగుపాముగా కనిపించడం సహజమే. కానీ ఈవిదంగానైనా రాష్ట్రంలో బిజెపి బలపడిందని టిఆర్ఎస్ నేతలు ఒప్పుకొంటున్నారని చెప్పవచ్చు.