రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ్ళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసివచ్చిన తరువాత ఓ విలేఖరి, ‘కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీలో చేరుతానని చెప్పారు కదా?” అని ప్రశ్నించగా ‘ఆయనొక్కరే కాదు... టిఆర్ఎస్కు చెందిన 25-30 మంది ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యవిరుద్దంగా ముందుకు సాగడం ఇష్టం లేక ఎవరినీ కలవడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనంతట తానే మా పార్టీలో చేరుతామని ప్రకటించారు కనుక త్వరలోనే మేము వెళ్ళి ఆయనను కలిసి మాట్లాడుతాం,” అని చెప్పారు.
లోక్సభ ఎన్నికలలో బిజెపి నాలుగు సీట్లు గెలుచుకోవడాన్ని ‘లక్కీ లాట్రీ’ తగలడంగా టిఆర్ఎస్ అభివర్ణించినప్పటికీ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిజెపి గెలుపును ఆవిధంగా చెప్పలేకపోవడమే రాష్ట్రంలో బిజెపి బలపడిందని చెప్పడానికి ఓ నిదర్శనం. అయితే దానార్ధం రాష్ట్రంలో టిఆర్ఎస్ బలహీనపడిందని కూడా కాదు. కనుక టిఆర్ఎస్కు చెందిన 25-30 మంది ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారని బండి సంజయ్ చెప్పడమే నమ్మశఖ్యంగా లేదు. బహుశః టిఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకే బండి సంజయ్ ఈవిధంగా చెప్పి ఉండవచ్చు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అది చాలా బలహీనపడి, ఆగమ్యగోచరమైన పరిస్థితిలో ఉంది కనుకనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు బిజెపిలో చేరుతున్నారని అందరికీ తెలుసు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెపుతున్నారు కదా!