పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు ఢిల్లీలో మూడు వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. వారికి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయచట్టాల కాపీలను ఆయన శాసనసభలో చించివేసి నిరసన తెలియజేశారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తానని ప్రమాణస్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వం చేసిన చట్టాల కాపీలను శాసనసభలో చించివేయడం, ఆందోళన చేస్తున్న రైతులకు సహాయసహకారాలు అందిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుండటం నేరమని ఆరోపిస్తూ ఢిల్లీ బిజెపి శాఖ అభిషేక్ దుబే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాధారణంగా అన్ని రాష్ట్రాలలో పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తుంటాయి. కానీ ఢిల్లీలో పోలీస్ శాఖ లెఫ్టినెంట్ గవర్నర్ అధీనంలో పనిచేస్తుంది కనుక పోలీసులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారం లేదు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధీనంలో పోలీసులు పనిచేస్తున్నారు కనుక వారు బిజెపి పిర్యాదుపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదు చేస్తారా లేదా? ఆయనపై ఏమైనా చర్యలు తీసుకోగలరా లేదా...చూడాలి.