మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బిజెపిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఇవాళ్ళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు ఉదయం మొదట పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యతలో కొనసాగడంపై ఆయన స్పందిస్తూ, “పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఉద్యోగులు, నగరంలోని సీనియర్ సిటిజన్ల అభిప్రాయానికి అద్దంపట్టాయి. దీంతో రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. 1. నగరవాసులు టిఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు. 2. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ను బిజెపి మాత్రమే ఢీకొనగలదు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టిఆర్ఎస్ను ఢీకొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తే, బలహీనపడిన కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎందుకు కొనసాగుతారు? అనే సందేహం కలుగకమానదు. కనుక గ్రేటర్ ఎన్నికల తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరిపోనున్నారా అనే సందేహం ఆయనే ఈ ట్వీట్తో కల్పించారు. మరి గ్రేటర్ ఎన్నికల తరువాత ఆయన ఏ పార్టీలో ఉంటారో చూడాలి.