సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం కావడంపై నిశితంగా విశ్లేషించి చూస్తే ఆ మూడు పార్టీలపై ఎంతో కొంత ఆ ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు.
టిఆర్ఎస్: ఈ ఉపఎన్నికలను సాధారణంగా కాక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడినందున ఈ ఓటమిని టిఆర్ఎస్ జీర్ణించుకోవడం కష్టమే. సిద్ధిపేట జిల్లాలోని కొనాయిపల్లి గ్రామంలో స్వామి అనే సామాన్య టిఆర్ఎస్ కార్యకర్త పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొన్నాడంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కార్యకర్తే అంతా ఒత్తిడికి గురైయ్యడంటే మరి గెలుపు కోసం పోరాడిన నేతలు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని, ఓటమికి కారణాలను విశ్లేషించుకొని ధైర్యంగా ముందుకు సాగిపోతామని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్రావు చెప్పినప్పటికీ టిఆర్ఎస్కు దీనిని జీర్ణించుకోవడం చాలా కష్టమే. ఈ ఉపఎన్నికలలో గెలిస్తే త్వరలో జరుగబోయే ఇతర ఎన్నికలలో ప్రజలు తమవైపే ఉన్నారని టిఆర్ఎస్ గట్టిగా చెప్పుకొనే అవకాశం ఉండేది. కానీ చెప్పుకోలేకపోయినా టిఆర్ఎస్కు పెద్దగా నష్టం ఏమీ లేదు. అయితే కేటీఆర్ చెప్పినట్లు దుబ్బాక ఓటమి టిఆర్ఎస్ను అప్రమత్తం చేసిందనేది నిజం. కనుక జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి మళ్ళీ కోలుకొని ఓటర్లను ఆకట్టుకొనేందుకు సరికొత్త పధకాలు, ప్రత్యర్ధులను చిత్తు చేసేందుకు మరింత బలమైన వ్యూహాలను సిద్దం చేసుకోగల సత్తా టిఆర్ఎస్కు ఉంది.