2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సిఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారు. గత ఏడాది బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు కేటాయించింది. కానీ ఇంత వరకు నిరుధ్యోగభృతి హామీని అమలుచేయలేదు. అయితే గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దాని గురించి నిన్న ఓ చిన్న సంకేతం ఇచ్చారు.
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో
ఆయన మాట్లాడుతూ, “నిరుద్యోగసమస్య కారణంగా రాష్ట్రంలో యువత కొంత
నిరుత్సాహంగా ఉన్నారని మాకు తెలుసు. వారికి ఉద్యోగాలు దొరికేవరకు కాస్త ఉపశమనం కలిగించేందుకు
నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ కరోనా కారణంగా ఇవ్వలేకపోయింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది కనుక త్వరలోనే సిఎం కేసీఆర్ నిరుద్యోగ
భృతిపై ఓ శుభవార్త చెప్పబోతున్నారు,” అని అన్నారు.