భారత్-చైనాల మద్య సరిహద్దుల వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో చైనా నుంచి ఎటువంటి సవాళ్ళు ఎదురైన ధీటుగా బదులిచ్చేందుకు భారత్ చురుకుగా ఏర్పాట్లు చేసుకొంటోంది. వాటిలో భాగంగానే జూలై 29న ఫ్రాన్స్ నుంచి అత్యాధునాతమైన, అత్యంత శక్తివంతమైన 5 రఫేల్ యుద్ధ విమానాలను రప్పించుకొంది. సెప్టెంబర్ 10వ తేదీన వాటిని అంబాలా ఎయిర్ బేస్లో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ బారతవాయుసేనకు అప్పగించారు. మళ్ళీ నవంబర్ 5వ తేదీన ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకొనున్నట్లు తెలుస్తోంది. అవికూడా అందుబాటులోకి వస్తే భారత్ వాయుసేన మరింత శక్తివంతమవుతుంది కనుక చైనా ఎటువంటి దుస్సాహసం చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోకతప్పదు. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఇరుదేశాల మద్య 2016లో ఒప్పందం జరిగింది. దాని ప్రకారం 2021 ఏప్రిల్లోగా మరో 16 రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు అందజేయవలసి ఉంది. మన దగ్గర ఉన్న పాత మిగ్-21 యుద్ధవిమానంతోనే పాకిస్థాన్కు చెందిన అత్యాధునాతమైన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చివేశారు. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు యుద్ధవిమానాలు భారత్ వాయుసేన చేతికి వస్తే ఇక పాక్, చైనాలు భారత్వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడక తప్పదు.