కనీవినీ ఎరుగనివిధంగా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వరదబాధితులకు సిఎం కేసీఆర్ ఓ శుభవార్త ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలలో నష్టపోయినవారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు. దీనికోసం రాష్ట్ర ఆర్ధికశాఖ రూ.550 కోట్లు మునిసిపల్ శాఖకు తక్షణమే విడుదల చేస్తుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ మొత్తాన్ని వర్షాలు, వరదలలో పాక్షికంగా లేదా పూర్తిగా ఇళ్ళు కోల్పోయినవారికి చెల్లిస్తామని చెప్పారు. నగరంలో ఇంచుమించు ప్రతీ ఇంటికీ రూ.10,000 చొప్పున నష్టపరిహారం అందించబోతున్నట్లు తెలిపారు.
పూర్తిగా ఇల్లు కూలిపోయినవారికి లక్షరూపాయలు, పాక్షికంగా ఇల్లు కూలిపోయినవారికి రూ.50,000, వరదనీటి ప్రభావానికి గురైన ఒక్కో ఇంటికి రూ.10,000 చొప్పున అందజేస్తామని సిఎం కేసీఆర్ చెప్పారు. ఈ ఆర్ధికసాయాన్ని మంగళవారం నుంచి బాధితకుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవవలసిన బాధ్యత తమపై ఉందని సిఎం కేసీఆర్ అన్నారు.