అమెరికా అధ్యక్షుడి వైభవం చూసి కేంద్రప్రభుత్వం రూ.8,400 కోట్లు ఖర్చు చేసి రెండు ఎయిర్ ఇండియా వన్ విమానాలను కొనుగోలు చేయడం చూస్తే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకొన్నట్లుంది అంటే చాలామందికి కోపం కలుగవచ్చు. కానీ ఓ పక్క దేశంలో లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి లక్షల కుటుంబాలు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తుంటే, లక్షలాదిమంది కరోనాతో అల్లాడుతుంటే రూ.8,400 కోట్లు ఖర్చు చేసి రెండు ఎయిర్ ఇండియా వన్ విమానాలను కొనుగోలు చేయడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాలలో మరింత భద్రతకోసం ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని వాదించేవారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు మన దగ్గరున్న ఎయిర్ ఇండియా విమానాలలో రెంటిని వారి ప్రయాణాల కోసం వినియోగించేవారు. ఇకపై ఈ ఖరీదైన, విలాసవంతమైన విమానాలలో వారు ప్రయాణించనున్నారు.
అమెరికాలో తయారైన ఎయిర్ ఇండియా వన్ విమానాలలో ఒకటి గురువారం న్యూఢిల్లీ చేరుకొంది. మరొకటి త్వరలోనే చేరుకొంటుంది. వీటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.
ఇది గంటకు సుమారు 900 కిమీ వేగంగా భూమికి 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు.
ఒకసారి ఇందనం నింపుకొంటే భారత్-అమెరికా మద్య ఎక్కడా ఆగకుండా ప్రయాణించగలవు. అవసరమైతేహ్ గాలిలోనే ఇందనం నింపుకొనే వెసులుబాటు కూడా ఉంది.
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలలో ఉండే అత్యాధునాతమైన భద్రతా వ్యవస్థలు వీటిలో కూడా ఉన్నాయి. ఈ విమానాలు క్షిపణి దాడులను ఎదుర్కోగలవు. వీటిజాడను శత్రువులు పసిగట్టకుండా రాడార్లను జామ్ చేసే ప్రత్యేక వ్యవస్థ వీటిలో ఉంది. దాంతో క్షిపణులను ఏమార్చి తప్పించుకోగలవు.
అమెరికా అధ్యక్షుడి విమానంలో మాత్రమే ఉండే స్వీయ రక్షణ సూట్ (సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్)ను వీటిలో కూడా అమర్చారు.
వీటిలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద సమావేశ మందిరం ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్లో ప్రయాణిస్తునప్పుడు ఏవిధంగా దానిని ఫ్లయింగ్ కమాండ్ సెంటర్గా పరిగణిస్తారో అదేవిదంగా వీటిలో ప్రధానమంత్రి ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఫ్లయింగ్ కమాండ్ సెంటర్గా పరిగణిస్తారు.
ఈ ఎయిర్ ఇండియా వన్ విమానాలను భారత్ వాయుసేనలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన పైలట్లు మాత్రమే నడుపుతారు. వాటి నిర్వహణ బాధ్యతలను ఎయిర్ ఇండియా సర్వీసస్ లిమిటెడ్కు అప్పగించబడుతుంది.