భారత్లో కరోనా ప్రవేశించి దాదాపు 6 నెలలవుతోంది. సుమారు రెండున్నర నెలలు కటినంగా లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గిందే తప్ప ఆగలేదు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి ఇంకా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు దేశంలో రోజుకు 50,000-55,000 కొత్త కేసులు పైనే నమోదవుతున్నాయి. గత 24 గంటలలో 56,282 నమోదయ్యాయి. వాటితో కలిపి భారత్లో కరోనా కేసుల సంఖ్య 19,64,536కి చేరింది. ఇప్పుడు రోజుకు 55,000 కేసులు నమోదవుతున్నందున ఇవాళ్ళ 20 లక్షల దాటిపోవడం తధ్యం. ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాలలో భారత్ 3వ స్థానంలో ఉంది. మరికొన్ని రోజులలో మొదటిస్థానానికి చేరుకోవడం తధ్యం.
అయితే భారత్లో రికవరీ రేటు 67 శాతంకి పెరిగినందున కొలుకొంటున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. దేశవ్యాప్తంగా బుదవారం వరకు 13,28,000 మంది కోలుకొన్నారు. కానీ కరోనాతో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయమే. బుదవారం వరకు దేశవ్యాప్తంగా 40,699 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జోరుగా సాగుతున్నప్పటికీ అది ప్రజలకు అందుబాటులో వచ్చేసరికి కనీసం మరో 3 నెలలు పట్టవచ్చు. కనుక రోజుకు 50,000 కొత్త కేసుల చొప్పున లెక్కవేసుకొంటే నెలకు 15.0 లక్షలు, ఆ లెక్కన రాబోయే 3 నెలల్లో 45-46 లక్షలకు పైగా కేసులు నమోదవవచ్చు. ఇప్పుడున్న 20 లక్షలతో కలుపుకొంటే మొత్తం 65-66 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.