కరోనా వైరస్ సోకకుండా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా...అని యావత్ ప్రపంచదేశాల ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. భారత్లో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటిక్ సంస్థ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. ఈ వారం నుంచే ఆ సంస్థ మనుషులపై క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడుతోంది. అయితే వ్యాక్సిన్ ఎప్పటికీ సిద్దం అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుందో ఇప్పుడే చెప్పడం జోస్యం చెప్పడమే అవుతుందని ఆ సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ కృష్ణ చెప్పారు. కానీ వ్యాక్సిన్ తయారీలో ఆ సంస్థకు సహాయసహకారాలు అందిస్తున్న ఐసీఎంఆర్ మాత్రం ఆగస్ట్ 15వ తేదీనాటికి వ్యాక్సిన్ను విడుదల చేస్తామని ప్రకటించేసింది. ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని, మనుషులపై చేసే ప్రయోగాలు కూడా తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నామని ఐసీఎంఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది.