తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందుకు సన్నాహాలు మొదలుపెట్టేసింది. ముందుగా డీ-బ్లాక్లోని ఐటి శాఖకు చెందిన సర్వర్ను తాత్కాలిక సచివాలయం బీఆర్కె భవన్కు సిబ్బంది తరలించారు. సచివాలయంలో నిరుపయోగంగా పడున్న పాతకార్లను బుదవారం క్రేన్ల సాయంతో తొలగించారు. ఈ నెలాఖరులోగానే సచివాలయం కూల్చివేత పనులు ముగించి ఆగస్ట్ నెలలో శ్రావణమాసం మొదలవగానే నూతన సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించవచ్చునని తెలుస్తోంది.
కొత్త సచివాలయం సుమారు రూ.400-600 కోట్లు వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలనుకొంటున్నట్లు ప్రభుత్వం ఇదివరకే హైకోర్టుకు తెలిపింది. అయితే లాక్డౌన్ కారణంగా ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా బెడద ఇంకా పెరుగుతున్నప్పుడు అంత ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించవలసిన అవసరం ఉందా? అని ప్రతిపక్షాల ప్రశ్న. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నందున, అన్ని ప్రాధమిక సౌకర్యాలు కలిగిన పాత సచివాలయం భవనాన్ని కోట్లు ఖర్చు చేసి మరీ చేజేతులా కూల్చివేసుకొనే బదులు కరోనా రోగులకు చికిత్సా కేంద్రంగా మార్చవచ్చు కదా?అని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.