భారత్-పాక్ సంబంధాలు ఏనాడూ గొప్పగా లేవు. ఇరుదేశాలలో ఎప్పుడైనా దేశాధినేతలు మారినప్పుడు ఆరడుగులు ముందుకు వెళుతుంటాయి. మళ్ళీ కొద్ది రోజులకే నాలుగడుగులు వెనక్కు వస్తుంటాయి. 1947లో భారత్, పాక్లకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఇరుదేశాల మద్య సంబంధాలు అలాగే సాగుతున్నాయి. న్యూడిల్లీలోని పాకిస్థాన్ హైకమీషన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దేశంలో గూడచర్యానికి పాల్పడుతుండటం, ఇస్లామాబాద్లో భారత్ దౌత్యవేత్తలను పాక్ గూడచారులు వెంబడించడం, ఆ తరువాత ఇద్దరు దౌత్యవేత్తలు కొన్ని గంటలసేపు అదృశ్యం కావడం, భారత్ ఒత్తిడితో వారిని పాక్ విడిచిపెట్టడం వంటి ఘటనలపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. కనుక న్యూఢిల్లీలో గల పాకిస్థాన్ హైకమీషన్లో పనిచేస్తున్న సిబ్బందిలో సగం మందిని వారం రోజులలోగా తగ్గించుకోవాలని పాకిస్థాన్ను కోరింది. అదేవిధంగా ఇస్లామాబాద్లో గల భారత్ దౌత్యకార్యాలయంలో 50 శాతం సిబ్బందిని తగ్గించుకోబోతున్నట్లు తెలియజేసింది. పాకిస్థాన్తో దౌత్య సంబంధాలు తగ్గించుకొనే ప్రయత్నాలలో ఈ నిర్ణయం తీసుకొంటున్నట్లు భారత్ తెలియజేసింది.
అయితే భారత్తో దౌత్య సంబంధాలు గొప్పగా ఉంటాయని లేదా ఉండాలని గానీ పాక్ ఏనాడూ కోరుకోలేదు కనుక ఇందుకు బాధపడకపోవచ్చు కానీ భారత్ను నిందించేందుకు దీనిని మరో గొప్ప అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. తాము భారత్తో సంబంధాలు బలపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటే భారత్ మొండివైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించడం తధ్యం.