దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతుండటంతో, దేశంలో వివిద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ మంగళ, బుదవారం వరుసగా రెండు రోజులు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
మొదటి రోజున, కేరళ, పంజాబ్, చంఢీఘర్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ & దామన్ డియూ, లడక్, పుదుచ్చేరి, లక్షద్వీప్ ముఖ్యమంత్రులతో సమావేశమవుతారు.
మరుసటిరోజు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, బిహార్, హర్యానా, జమ్ముకశ్మీర్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యి కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చిస్తారు. దేశంలో మళ్ళీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నందున మళ్ళీ మరోసారి లాక్డౌన్ విధించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులతో సమావేశం అవుతుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.