వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి కాపాడాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించుకొంటుంటారు తెలంగాణ ప్రజలు. కానీ కరోనా మహమ్మారి సర్వత్రా వ్యాపించి ఉన్న నేపధ్యంలో ఈనెల 25 నుంచి మొదలయ్యే బోనాల ఉత్సవాలను అందరూ కలిసి సంతోషంగా నిర్వహించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
లాక్డౌన్ ఆంక్షలు సడలించినప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ శరవేగంగా పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో బోనాల ఉత్సవాలకు అనుమతిస్తే వేలాదిమంది ప్రజలు ఒకేచోట గుమిగూడితే ఇంకా ప్రమాదం. పైగా కేంద్రప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు సడలించి ఆలయాలలో పరిమిత సంఖ్యలో భక్తుల ప్రవేశానికి అనుమతించినప్పటికీ సామూహిక ప్రార్ధనలు, ఉత్సవాలకు అనుమతించలేదు. కనుక బోనాల పండుగను ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ళలోనే జరుపుకొంటే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. ఈరోజు సిఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రుల సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.