నోరూరించే యాపిల్ పళ్ళు కొనుకొని తినాల్సిందే తప్ప ఎక్కడపడితే అక్కడ యాపిల్ మొక్కలు వేసుకొని పండించుకోలేము. యాపిల్ తోటల సాగుకు సరైన వాతావరణం, సరైన నేల అవసరం. అటువంటి నేల, వాతావరణం మన దేశంలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ఉండటంతో అక్కడి నుంచే మనకు యాపిల్స్ వస్తుంటాయి. అయితే ఆసిఫాబాద్లో కూడా యాపిల్ పంట సాగుచేయవచ్చని జిల్లాలోని కెరమెరి మండలంలో ధనోరాకు చెందిన బాలాజీ అనే రైతు నిరూపించి చూపాడు.
తన తోటలో తొలిసారిగా కాసిన యాపిల్ పండ్లను సిఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలనుకొంటున్నట్లు అధికారులకు చెప్పడంతో ఈరోజు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్కు రావలసిందిగా బాలాజీకి పిలుపు వచ్చింది. బాలాజీ స్వయంగా ఈరోజు సిఎం కేసీఆర్ను కలిసి తన తోటలో కాసిన యాపిల్ పండ్లను సిఎం కేసీఆర్కు బహుమతిగా అందజేశారు. సిఎం కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. అవి రుచిలో కశ్మీర్ యాపిల్స్ కు తీయిపోనట్లున్నాయి కనుక జిల్లాలో యాపిల్ సాగును విస్తరించేందుకు అవకాశాలను పరిశీలించవలసిందిగా సిఎం కేసీఆర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. తొలిసారిగా తెలంగాణలో కాసిన యాపిల్ పండ్లు త్వరలోనే హైదరాబాద్ మార్కెట్లోకి రానున్నాయి.