రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిన్న రాత్రి గోల్కొండ హోటల్లో మళ్ళీ ఈరోజు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైనప్పటికీ సిఎల్పీ నేతను ఎన్నుకోలేకపోయారు. సిఎల్పీ నేత ఎన్నికలో పార్టీ ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంతో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ ఒక తీర్మానం ఆమోదించారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో అనేకమంది సీనియర్ నేతలు ఓడిపోవడంతో సిఎల్పీ నేత పదవికి పోటీ గణనీయంగా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీలో 19మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరిని ఎన్నుకోవలసి ఉండగా ఆ పదవికి కూడా 3-4 మంది పోటీపడటంతో సిఎల్పీ నేతను కూడా రాహుల్ గాంధీయే నిర్ణయించవలసివస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఏవిధంగా కీచులాడుకునేవారో?