మంగళవారం హైదరాబాద్లోని జలవిహార్లో దివ్యాంగుల పెన్షనర్ల కృతజ్ఞత సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ మహాకూటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నాలుగు పార్టీలు సీట్లు పంచుకోలేనప్పుడు, రేపు అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఏవిధంగా నడిపిస్తాయి?” అని ప్రశ్నించారు.
మహాకూటమిలో రెండు నెలలుగా సాగుతున్న సీట్ల పంపకాలపై చర్చలను చూస్తున్న ప్రజలకు ఇదే అనుమానం కలిగి ఉంటే ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కీచులాటలు సర్వసాధారణమైన విషయమే. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే మొదట కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి పదవి, మంత్రిపదవుల కోసం కీచులాటలు మొదలవుతాయనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు దానికి మరో మూడు పార్టీలు జత కలిశాయి. కనుక పోటీ మరింత ఎక్కువ ఉంటుంది. నాలుగు పార్టీలవి నాలుగు రకాల సిద్దాంతాలు...విధానాలు...ఆలోచనలు. కనుక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తప్పవు. కనుక మహాకూటమిలోని పార్టీలు తాము అధికారంలోకి వస్తే సజావుగా, తెరాస కంటే బాగా పరిపాలన సాగించగలమనే నమ్మకం ప్రజలకు కలిగించవలసిన అవసరం కూడా ఉంది.