జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మాటలలో ‘మడమ తిప్పను’ ‘ఆత్మాభిమానం’ అనే రెండు పదాలు వినబడుతుంటాయి. కానీ ఆయన తరచూ మడమలు అరిగిపోయేలా తిప్పుతూనే ఉంటారని అందరికీ తెలుసు. ఒకప్పుడు ఈనాడు మీడియా, దాని అధినేత రామోజీరావును సాక్షి మీడియాలో నానా శాపానార్ధాలు పెట్టి, ఆయనపై వ్యంగ్యంగా అనేక కార్టూన్లు కూడా వేసిన సంగతి అందరికీ తెలుసు.
గతంలో చంద్రబాబు నాయుడుకి అధికారం దక్కించడంలో ఈనాడు మీడియా దాని అధినేత రామోజీరావు కీలకపాత్ర పోషించిన సంగతి బహిరంగ రహస్యమే. ఈనాడు మీడియా తెదేపాకు వత్తాసు పలుకుతుందనే అక్కసుతో దాని అధినేత రామోజీరావుని సాక్షి మీడియా అనేకసార్లు విమర్శలు గుప్పించింది. పైగా సాక్షి మీడియాకు ఈనాడు మీడియా గట్టి పోటీనిస్తుండటం కూడా జగన్ కడుపు మంటకు మరో కారణం అయ్యుండవచ్చు. కారణాలు ఏవయితేనేమి, రామోజీరావును అవమానిస్తూ సాక్షి మీడియాలో వచ్చిన రాతలు, కార్టూన్లు అన్నీ ఇన్నీ కావు.
ఆయన పట్ల అంత అవమానకరంగా వ్యవహరించి, మళ్ళీ ఆయన ఆశీస్సులు కోరుతూ జగన్ ఈరోజు ఆయనను కలవడం చాలా విడ్డూరంగా ఉంది. ఒకప్పుడు ఎవరినైతే నోరారా దూషించారో, ఇపుడు ఆత్మాభిమానం చంపుకొని అదే వ్యక్తి ముందు జగన్ చేతులు జోడించి నిలబడటం కంటే దురదృష్టం ఏముంటుంది? చేతులు జోడించి నిలబడినంత మాత్రాన్న రామోజీరావు గతాన్ని మరిచిపోయి జగన్ కు ఆశీసులు అందజేస్తారా? అంటే కాదనే చెప్పవచ్చు. ప్రయోజనం ఉండదని తెలిసి ఉన్నప్పుడు జగన్ ఆయన ముందు చేతులు జోడించడం వలన నవ్వులపాలయినట్లే కదా! ఏమిటో ఈ జగన్ రాజకీయాలు..ఎప్పుడూ బెడిసికొడుతూనే ఉంటాయి కదా!