కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ఆ పార్టీలో రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి చర్చ జరగడం సాధారణమైపోయింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఓడిపోవడంతో ఇంటా బయటా కూడా మళ్ళీ ఇదే అంశంపై చర్చ మొదలైంది. దీనిపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా స్పందణ చాలా ఆసక్తికరంగా ఉంది. అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ “ఈ ఒక్క విషయంలోను నేను అసలు మాట్లాడదలచుకోలేదు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. మేము మా ప్రత్యర్ధుల బలహీనతపై ఆధారపడి రాజకీయాలు చేయము,” అని క్లుప్తంగా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ శల్యసారధ్యం చేస్తున్నంత కాలం భాజపాకు, మోడీ ప్రభుత్వానికి తిరుగుఉండదని భాజపా నేతలు అంటుంటారు. అది నూటికి నూరు శాతం నిజమని మొన్న జరిగిన ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. కనుక కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే సారద్యం వహించాలని కాంగ్రెస్ నేతలే కాదు భాజపా కూడా కోరుకొంటున్నట్లు చెప్పవచ్చు. భాజపాను విజయపధంలో నడిపిస్తున్న అమిత్ షా తన ప్రత్యర్ధ పార్టీకి ఈవిషయంలో మంచి సలహా ఇస్తే దాని వలన నష్టపోయేది భాజపాయే కనుక ఆయన కాంగ్రెస్ నాయకత్వ సమస్యకు దూరంగా ఉండాలనుకొన్నారు. ఇది ఆయన రాజకీయ విజ్ఞతకు అద్దం పడుతోంది. తమ ప్రత్యర్ధ పార్టీకి ఒక అసమర్ధుడు, బొత్తిగా నాయకత్వ లక్షణాలు లేనివాడు సారధ్యం వహిస్తుంటే భాజపాకు అది చాలా సంతోషించవలసిన విషయమే కదా! కనుక భాజపాలో మిగిలిన నేతలు, మంత్రులు అందరూ కూడా కాంగ్రెస్ నాయకత్వ సమస్యకు ఎంత దూరంగా ఉంటే అంత వారికే మంచిది.