తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇద్దరూ గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ఆటంకం కలిగించినందుకు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు సభ నుంచి సస్పెండ్ చేయబడిన సంగతి తెలిసిందే. స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఉభయసభలను ఉద్దేశ్యించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో సభ్యులు తమ నిరసన తెలియజేయవచ్చని, అందుకు సభ్యులను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉండదని, కనుక తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయవలసిందిగా స్పీకర్ ను ఆదేశించాలని రేవంత్ రెడ్డి తన పిటిషనులో కోరారు.
సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనలు, వాక్ అవుట్లు చేయడం సహజమే కానీ గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు నిరసనలు తెలియజేయడం ఆయన పట్ల అగౌరవంగా వ్యవహరించినట్లేనని చెప్పక తప్పదు. అధికార పార్టీ వ్రాసిచ్చిన ప్రసంగంపై ప్రతిపక్షాలు తమ నిరసనలు, వ్యతిరేకతను తెలియజేయాలంటే తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో నిరభ్యంతరంగా తెలుపవచ్చు. కానీ గవర్నర్ ప్రసగానికి ఆటంకం కలిగించడం సత్సంప్రదాయం కాదు. బహుశః రేపు హైకోర్టు కూడా ఇదేమాట చెప్పవచ్చు.