ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు మొదలయింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అన్ని సర్వేల అంచనాలను తారుమారు చేస్తూ భాజపా పూర్తి ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 403స్థానాలలో ఇంతవరకు జరిగిన ఓట్ల లెక్కింపులో భాజపా 256 స్థానాల ఆధిక్యతతో దూసుకుపోతోంది. కనుక ఆ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇది అధికార సమాజ్ వాదీకి దానితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు ఊహించనివే కనుక వాటికి ఇవి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పకతప్పదు. వారి కూటమికి (సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీ) కేవలం 66 స్థానాలలో మాత్రమే ఆధిక్యత సాధించగలిగింది.
ఒకవేళ ఎవరికీ పూర్తి మెజారిటీ రాని పక్షంలో మాయావతి పార్టీతో (బి.ఎస్.పి.) పొత్తులు పెట్టుకొని అధికారం దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిద్దపడ్డారు. కానీ ఆమె పార్టీ కూడా చాలా వెనుకబడిపోయింది. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న మాయావతి ఈసారి ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకొందామని ఆశిస్తే ఆమె పార్టీకి ఇంతవరకు కేవలం 39 స్థానాలలో మాత్రమే ఆధిక్యత సాధించగలిగింది. తాజా ఆధిక్యతలు: భాజపా: 256, ఎస్.పి+కాంగ్రెస్:66, బి.ఎస్.పి:39, ఇతరులు: 05.