తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిద్యం వహించిన చెన్నైలోని రాధాకృష్ణ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కోసం ఎన్నికల కమీషన్ గురువారం షెడ్యూల్ ప్రకటించింది. కనుక మళ్ళీ తమిళనాడులో రాజకీయ వేడి పెరగడం ఖాయం.
ఈనెల 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. వాటి పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ తరువాత ఏప్రిల్ 12వ తేదీన ఎన్నికలు జరుగాతాయి. ఏప్రిల్ 17న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించబడతాయి.
జయకు అసలైన వారసురాలు తానేనని చెప్పుకొంటూ కొట్టగా పార్టీని కూడా స్థాపించిన ఆమె మేనకోడలు దీపా జయకుమార్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అక్కడి నుంచే పోటీ చేస్తానని పదేపదే చెపుతున్నారు. అలాగే అమ్మకు అసలైన వారసుడినని చెప్పుకొంటున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఈ ఉప ఎన్నికలలో తన తరపున అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకొని తన వాదనను నిరూపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నం చేయవచ్చు. శశికళ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామికి చలా స్వల్పమైన మెజార్టీతో ప్రభుత్వం నడిపిస్తున్నారు కనుక ఈ ఉపఎన్నికలలో బలమైన అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. జయలలిత మృతి తరువాత ఒక మంచి రాజకీయ అవకాశాన్ని తన అవివేకం, అనాలోచిత నిర్ణయాలతో చేజార్చుకొని అప్రదిష్టపాలైన డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, పోయిన తన పరువును దక్కించుకొనేందుకు ఈ ఉపఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్, భాజపాలు రెండూ కూడా ఎప్పటిలాగే ఆటలో అరటి పండులాగ మిగిలిపోవచ్చు.