జయలలిత మృతి చెందినప్పటి నుంచి రాజకీయాలలోకి వస్తానని ఊరిస్తూ ఇంతవరకు ఎటూ తేల్చుకోలేకపోతున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ ఎట్టకేలకు నిన్న పన్నీర్ సెల్వంకు జైకొట్టి ఆయన వర్గంలో చేరిపోయారు. నిన్న సాయంత్రం పన్నీర్ సెల్వంతో కలిసి ఆమె మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక నుంచి తాను పన్నీర్ సెల్వం నేతృత్వంలో అన్నాడిఎంకె పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు.
దీపా జయకుమార్ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలశ్యం చేశారని చెప్పక తప్పదు. ఇదే నిర్ణయం ఆమె ముందే ప్రకటించి ఉండి ఉంటే, అన్నాడిఎంకె ఎమ్మెల్యేలలో చాలా మంది పన్నీర్ సెల్వంకే మద్దతు ఇచ్చి ఉండేవారేమో? శశికళ కొత్తగా పళనిస్వామిని తెర మీదకు తీసుకురావడంతో ఆయన పన్నీర్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకవేళ పన్నీర్ సెల్వం మళ్ళీ అధికారం చేజిక్కించుకోలేకపోతే దీపా జయకుమార్ రాజకీయ ప్రవేశం వలన ఎటువంటి ప్రయోజనం ఉండక పోవచ్చు. కానీ ఆమె వాపును చూసి బలుపు అనుకొని కొత్త పార్టీ స్థాపించే ప్రయత్నం చేయకుండా పన్నీర్ సెల్వంతో చేతులు కలపడం మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు.