ఏపి సిఎం చంద్రబాబు నాయుడు “ఆరోగ్య రక్ష” అనే ఒక సరికొత్త ఆరోగ్య భీమా పధకాన్ని సోమవారం విజయవాడలో ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ వంటి పధకాలకు అర్హులు కానీ మిగిలిన ప్రజలందరూ ఈ సరికొత్త భీమా పధకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. దీనికోసం కుటుంబంలో ఒక్కో సభ్యుడికి నెలకు రూ.100 భీమ చెల్లించవలసి ఉంటుంది. అంటే ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబ ఏడాదికి 3,600 చెల్లించినట్లయితే ముగ్గురికీ కలిపి ఆరు లక్షలు, ఒక్కకరికీ అయితే రూ.2 లక్షల ఆరోగ్యభీమా లభిస్తుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పధకం అమలు అవుతున్న ఆసుపత్రులన్నిటిలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “ఈ పధకం చూసి తెల్లరేషన్ కార్డు కలిగిన వాళ్ళు భయపడనవసరం లేదు. వారు తమ కార్డుల ద్వారా యధాప్రకారం అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చు. రాష్ట్రంలో అందరికీ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ కలిగి ఉండాలని కోరుకొంటున్నాను. గత ఏడాదిలో మనం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తట్టుకొని నిలబడి సుస్థిరత సాధించగలిగాము. 2017లో రాష్ట్రం ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం,” అని అన్నారు.
రాష్ట్రంలో మొత్తం ప్రజలందరికీ ఆరోగ్యభీమా ద్వారా ఉచిత వైద్య సేవలు అందించే పధకాన్ని దేశంలో మొట్టమొదట ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ సర్కార్ కే దక్కింది. ఒకవేళ దీనిని ఏపి సర్కార్ సమర్ధవంతంగా అమలుచేయగలిగితే, వచ్చే ఎన్నికలలో అదే దానికి గొప్ప వరంగా మారవచ్చు.