మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్లోని స్పెషల్ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2016 గ్రేటర్ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ షబ్బీర్ అలీ ప్రయాణిస్తున్న కారుపై మజ్లీస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనపై మీర్చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దానిని కోర్టుకు సమర్పించారు. ఆ కేసు విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఎన్నిసార్లు నోటీసులు పంపించినా అసదుద్దీన్ ఓవైసీ స్పందించకపోవడంతో ఆయనపై సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
గత ఐదారేళ్ళుగా అసదుద్దీన్ ఓవైసీ, సిఎం కేసీఆర్ల మద్య, అలాగే టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీల మద్య బలమైన స్నేహసంబంధాలు కొనసాగాయి. ఇటీవల గ్రేటర్ ఎన్నికలలో ఆ రెండు పార్టీలు దూరమైనట్లు చెప్పుకొంటున్నాయి. కనుక ఇంతకాలం లేనిది ఇప్పుడు హటాత్తుగా అసదుద్దీన్ ఓవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవడం కాస్త ఆలోచింపజేస్తోంది. మన న్యాయవ్యవస్థకు అందరూ సమానమే అయినప్పటికీ కొందరు అధికసమానమనే మాట తరచూ వినబడుతుంటుంది. కనుక ఇంతకాలం ఆ అధికసమాన కోవలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీకి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ఎందుకు అయ్యిందో... దాని తదనంతర పరిణామాలు ఏవిధంగా ఉంటాయో చూడాలి.